కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట నియోజకవర్గంలో ఒకప్పుడు కేవలం 8 వేల ఎకరాల్లోనే వరి సాగు జరిగేదని, కానీ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఈ యాసంగిలో ఏకంగా 80 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక వరం లాంటిదని, ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేట నేడు బంగారు పంటలతో కళకళలాడుతోందని ఆయన పేర్కొన్నారు.
సిద్దిపేట మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణవ్యాప్తంగా రైతులు సుమారు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. మార్కెట్లో మొక్కజొన్నకు 2,400 రూపాయల మద్దతు ధర ఉన్నప్పటికీ, ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు 1,700 రూపాయలకే అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు.
ప్రభుత్వ జాప్యం వల్ల ఇప్పటికే 25 శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నిరంతర ఒత్తిడి చేయడంతోనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో అందుబాటులోకి వచ్చిన ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధరతో మంచి ఆదాయం పొందాలని హరీష్ రావు (Harish Rao) కోరారు.

