కలం, స్పోర్ట్స్ : పంజాబ్ స్ప్రింటర్ గుర్విందర్ వీర్ సింగ్ (Gurvinder Veer Singh) సంచలనం సృష్టించారు. భువనేశ్వర్ వేదికగా బుధవారం ముగిసిన తొలి నేషనల్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సరికొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. పురుషుల 60 మీటర్ల పరుగు పందెంలో కేవలం 6.60 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ రేసులో ముగ్గురు అథ్లెట్లు ఫాల్స్ స్టార్ట్ చేయడంతో అనర్హతకు గురయ్యారు. ఫేవరెట్ అథ్లెట్ అనిమేష్ కుజూర్తో పాటు జయరామ్, నేహల్ సాగర్ రేసు నుండి నిష్క్రమించారు. ఐదుగురు అథ్లెట్లతోనే నిర్వహించిన ఫైనల్లో గుర్విందర్ వీర్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు. 2022లో వి.కె. ఇళక్కియదాసన్ నెలకొల్పిన 6.67 సెకన్ల రికార్డును ఆయన అధిగమించారు.
ఈ విజయంపై గుర్విందర్ (Gurvinder Veer Singh) సంతోషం వ్యక్తం చేశారు. 2026 సీజన్కు ఇది మంచి ఆరంభమని, అవుట్డోర్ పోటీల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ పోటీలో ఒడిశాకు చెందిన లాలూ ప్రసాద్ భోయ్ రజతం, హర్యానాకు చెందిన నుజ్రత్ కాంస్య పతకం గెలుచుకున్నారు.
మహిళల విభాగంలోనూ రసవత్తర పోటీ నెలకొంది. మహారాష్ట్రకు చెందిన హరిత భండ్రా 7.32 సెకన్లలో 60 మీటర్ల దూరాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచారు. కర్ణాటకకు చెందిన ఉన్నతి బొల్లాండ రజతం సాధించగా, మహారాష్ట్రకు చెందిన త్రిష నాయర్ కాంస్య పతకం దక్కించుకున్నారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ మెగా ఈవెంట్లో దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు తమ ప్రతిభను చాటుకున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో నమోదైన ఈ రికార్డులు భారత అథ్లెటిక్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. భవిష్యత్తులో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు ఈ ఛాంపియన్షిప్ వేదికగా నిలిచింది.
Read Also: ఉదయం నిద్రలేవగానే తలనొప్పి వస్తుందా.. నిర్లక్ష్యం చేయొద్దు !
Follow Us On : WhatsApp

