కలం, యాదగిరిగుట్ట: తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం (Yadadri Temple)లో ఏకాదశి (Ekadashi) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ‘లక్ష పుష్పార్చన’ సేవను నిర్వహించారు. మంగళవాయిద్యాలు, సన్నాయి మేళం, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం సుమారు గంటకు పైగా ఈ పుష్పార్చన ఉత్సవం కనులపండువగా సాగింది.
ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ అర్చకులు ఏకాదశి, లక్ష పుష్పార్చన పూజల విశిష్టతను, ప్రాధాన్యతను వివరించారు. ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో యాదాద్రికి తరలివచ్చారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించారు.

