కలం, జనగామ: జనగామ జిల్లా (Jangaon District) రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామ సమీపంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా పెను ప్రమాదం తప్పింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ట్రాక్టర్ ట్రైలర్లో లోడ్ చేసి తరలిస్తుండగా ఖిలాషాపూర్ గ్రామం వద్ద సర్వీస్ రోడ్డుపై ఒక్కసారిగా వాహనం అదుపుతప్పింది. దీంతో ట్రైలర్ రోడ్డుపై బోల్తా పడగా, అందులో ఉన్న ధాన్యపు బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై రద్దీ తక్కువగా ఉండటంతో ఇతర వాహనాలకు ఎలాంటి నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం స్థానికుల సహాయంతో రోడ్డుపై పడిన ధాన్యపు బస్తాలను తొలగించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

