Mobile Popup Ad
Mobile Popup Ad

జీతాల పెంపు.. ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల పోరుబాట

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు, జిల్లా, ఏరియా, సీహెచ్‌సీ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు తక్షణమే వేతనాల పెంపుకై 3 రోజుల పాటు కార్మికులు రాష్ట్రవ్యాప్త పోరుబాటకి శ్రీకారం చుడుతున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జూలై 7 నుండి 9 వరకు నిర్వహించే తలపెట్టిన ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల (Govt Hospital Contract Workers) ఆందోళన నోటీసులను శుక్రవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రంగా అజ్మీరకు ఆసుపత్రి కార్మికులు అందజేశారు.

ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు మూడేళ్ళ కాలపరిమితితో నిర్వహిస్తున్నదని అన్నారు. అయితే ప్రస్తుత ఏజెన్సీలు మూడు సంవత్సరాల వ్యవధి ముగిసిపోయి ఏడాది పూర్తిగా కావచ్చిన కొత్త ఏజెన్సీ నిర్వాహణకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయకుండా పాత ఏజెన్సీల కాంట్రాక్టర్లకే కొనసాగించడం దారుణమని మండిపడ్డారు.

అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి..

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న ఏజెన్సీలు ప్రభుత్వ నిర్ణయించిన వేతనాలు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు పారదర్శకంగా లేవని.. కార్మికుల వేతనాల చెల్లింపుల్లో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కావున ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించి కార్మికులకు 26 వేల కనీస వేతనం అందే విధంగా నూతన టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి పడకల సామర్థ్యం అనుగుణంగా అదనపు కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలన్నారు. జాతీయ, పండగ, ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని, కార్మికులకు ఒక నెల జీతం బోనస్ గా చెల్లించాలని కోరారు.

ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలని.. తదితర డిమాండ్ల సాధనకై ఈనెల 7 నుండి 8 వ తేదీ వరకు ప్రభుత్వ ఆస్పత్రుల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 9వ తేదీన ఆసుపత్రి కార్మికుల చలో హైదరాబాద్ పేరిట కోఠీలోని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామని అన్నారు. కార్మికులు అధిక సంఖ్యలో ఆసుపత్రి కార్మికుల జీతాల పెంపు పోరుబాట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులు బి. చెన్నయ్య, ఎస్.దేవానంద్, రంగన్న, భీమన్న, శ్రీనివాస్ రెడ్డి, జగ్గా నాయక్, సాయి ప్రకాష్, నరేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>