కలం, వెబ్డెస్క్: భారత రాజకీయాల్లో సామాజిక న్యాయం అనేది చాలా కాలంగా కేవలం ఎన్నికల నినాదంగా, మేనిఫెస్టో లైన్గా, ఓట్ల కోసం ఇచ్చే వాగ్దానంగా మిగిలిపోయిందని ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (Ghanta Chakrapani) అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలన్నీ సమానత్వం, సాధికారత, ప్రాతినిధ్యం గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పటికీ వాస్తవానికి అధికార నిర్మాణాల్లో ఎలాంటి మార్పులు రావడం లేదని ఆయన విమర్శించారు. అయితే టీవీకే అధినేత విజయ్ (TVK Vijay) తన కేబినెట్లో ఏడుగురు దళితులకు చోటు కల్పించడం ద్వారా ఈ సంప్రదాయానికి భిన్నంగా బలమైన కొత్త సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారని ఘంటా పేర్కొన్నారు.
టీవీకే విజయ్ కేబినెట్పై ఎక్స్ వేదికగా స్పందించిన ఘంటా చక్రపాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ రాజకీయాలతో ఎవరికైనా విభేదాలు ఉండవచ్చని, ఆయనతో అన్ని విషయాల్లో ఏకీభవించకపోవచ్చు అని చెప్పారు. అయితే అణగారిన వర్గాలకు లభించే ప్రాతినిధ్యం అనేది అత్యంత కీలకమని స్పష్టం చేశారు. కేవలం ఉపన్యాసాల్లో దళితులను, వెనుకబడిన వర్గాలను గుర్తుంచుకోవడం సామాజిక న్యాయం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. నాయకత్వంలో, నిర్ణయాధికారాల్లో, అధికార పంపకాల్లో ఆయా వర్గాలను భాగస్వాములను చేసినప్పుడే సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చేకూరుతుందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే విజయ్ సరికొత్త పాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టారని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.

