కలం, కరీంనగర్ బ్యూరో: రెండు రోజుల్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. వడ్లను జిల్లా అధికారుల ఇళ్ల ముందు పోస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) హెచ్చరించారు. నియోజకవర్గంలోని రూరల్ మండలం నగునూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం తీసుకువచ్చి నెలన్నర గడుస్తున్నా తమను పట్టించుకున్నవారే లేరని రైతులు మొరపెట్టుకున్నారు. ధాన్యాన్ని కొనకపోతే తమకు ఆత్మహత్య శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. చలించిన ఎమ్మెల్యే గంగుల జిల్లా అదనపు కలెక్టరుతో మాట్లాడారు. మార్కెట్ యార్డులోని ఏడో గోదామును.. రైతుల కోసం కేటాయించాలని కోరారు. అప్పటికప్పుడు సివిల్ సప్లై అధికారులను అక్కడికి పిలిపించి సమస్యలపై నిలదీశారు.
ముందే హెచ్చరించినా..
హమాలీలు, లారీల కొరత కారణంగానే ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నట్లు అధికారులు ఎమ్మెల్యే గంగులకు (Gangula Kamalakar) తెలియజేశారు. వెంటనే గ్రామంలోని ట్రాక్టర్లను రవాణా కోసం మాట్లాడి.. అప్పటికప్పుడు హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యం తరలించారు. చేగుర్తిలో తడిసిన ధాన్యాన్ని గమనించి, కూలీలను ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చి.. కాంటా వేయించి రైస్ మిల్లులకు తరలించారు. ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని.. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో మే 5వ తేదీలోగా కొనుగోళ్లు పూర్తి చేసి, రైతులకు డబ్బులు కూడా చెల్లించేవారమన్నారు. రెండు రోజుల్లో తడిసిన ధాన్యంతో సహా కొనుగోళ్లు చేపట్టాల్సిందేనని హెచ్చరించారు. కరీంనగర్ ఫ్యాక్స్ ఛైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, దుర్శేడ్ ప్యాక్ ఛైర్మన్ తోట తిరుపతి, ప్యాక్స్ డైరెక్టర్ లక్ష్మయ్య, మహేందర్, నాయకులు సుంకిశాల సంపత్ రావు, రంగారెడ్డి, కోటేశ్వర్, వినయ్, అరే శ్రీకాంత్, భద్రయ్య, రామ్ రెడ్డి, నేతి రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Also: తుమ్మిడిహెట్టి బ్యారేజ్పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
Follow Us On : WhatsApp

