కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని బాపూ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’ (Gandhi Sarovar Project )పనులను చేపట్టడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనుమతులు మంజారు చేశారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు, భారత సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’ కు అనుమతి లభించడం, తెలంగాణ ప్రభుత్వ విజన్ లక్ష్యాలను సాధించడంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, అలాగే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పర్యావరణ, సాంస్కృతిక, సామాజిక వనరుల సృష్టి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ నిర్ణయం మరింత బలాన్ని చేకూరుస్తుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం అందిస్తున్న సహకారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొంటూ ఓ నోట్ విడుదల చేశారు.

