కలం, మఖ్తల్ : లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) జన్మదినాన్ని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఘనంగా నిర్వహించారు. మఖ్తల్లోని (Makthal) మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ దేశంలో కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఐక్యతకు కృషి చేస్తున్న నాయకుడని అన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు 4200 కిలోమీటర్లు నడిచి నిర్వహించిన భారత్ జోడోయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలలో ఐక్యత సందేశం వ్యాప్తి చేశారని తెలిపారు.“మనమెంతో మనకంత” అనే నినాదంతో, “జిత్నే అబాది హే ఉత్నే హక్క్ మిల్నా చాహియే” అనే భావనతో బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో కుల గణన నిర్వహించడం కూడా అదే దిశగా ఒక ముఖ్యమైన అడుగని తెలిపారు. ఇంకా చట్టసభలలో సరైన ప్రాతినిధ్యం పొందని వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడంలో రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని, వారికి అన్ని రంగాలలో అవకాశాలు కల్పించే దిశగా ఆయన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు మంచి ఆరోగ్యం, శక్తి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మఖ్తల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

