కలం, జోగుళాంబ గద్వాల: ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియతో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని గద్వాల్ జిల్లా కలెక్టర్ (Gadwal Collector) రిజ్వాన్ బాషా షేక్ (Rizwanbasha Shaik) అన్నారు. SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు గురువారం ఉదయం గద్వాల కలెక్టరేట్ నుంచి 2కే రన్ ను జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.
అధికారులు, విద్యార్థులు, ఓటర్లు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని ఓటరు చైతన్యానికి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ఓటరు చైతన్య నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ఈ రన్లో పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి రైల్వే ఫ్లై ఓవర్ మీదుగా కృష్ణవేణి చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ రన్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న SIR ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
మరణించిన వారి, అనర్హుల ఓట్లను తొలగించి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు SIR ప్రక్రియ దోహదపడుతుందని అన్నారు. ఈనెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలను జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించినట్లు తెలిపారు. డ్రగ్ రహిత జిల్లాగా పేరు తీసుకురావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నివారణ పై నిర్వాహకులు ప్రతిజ్ఞను చేయించారు.
అనంతరం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు సే నో టు డ్రగ్స్ సిగ్నేచర్ క్యాంపెయిన్ బోర్డుపై తమ సంతకాలను చేశారు. ఐ యాం ఎన్ యాంటీ డ్రగ్ షోల్డర్ బోర్డు వద్ద ఫోటోలను దిగారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు SIR ప్రాముఖ్యతపై ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఎన్నికల విభాగం అధికారులు, బీఎల్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

