కలం వెబ్ డెస్క్: ఏపీలో పెట్రోల్ కొరత (Petrol Shortage)తో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బంకులు మూతపడుతున్నాయి. బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సరిపడా డీజిల్ దొరక్క వ్యవసాయ పనులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 186 పెట్రోల్ బంకులు ఉంటే వీటిలో 45 మూసివేశారు. వందకు పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. వరుసగా బంకులు మూతపడుతుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెరిచి ఉన్న బంకుల ముందు భారీ ఎత్తున క్యూ కట్టారు. పోలీసులు బంకులకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని చోట్ల బంకు యజమానులకు, వాహనదారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు విజయవాడ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే జనాలు ఎక్కువగా రావడం వల్ల, అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని బంకు యజమానులు అంటున్నారు.

