కలం, వెబ్ డెస్క్: ఆహార పదార్థాల తయారీ, నిర్వహణ, ప్యాకింగ్కు సంబంధించి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) ఒక కీలక అడ్వైజరీని జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలని సూచించింది. ఫుడ్ తయారీ, నిల్వకు సంబంధించి తుప్పు పట్టిన, రంగులు ఊడిపోయిన, విరిగిన లేదా పాడైపోయిన కత్తులు, బ్లేడ్లు, ఇతర కటింగ్ పరికరాలను ఉపయోగించకూడదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. ఫుడ్ బిజినెస్ నిర్వాహకులు కేవలం ఫుడ్-గ్రేడ్, నాన్-టాక్సిక్, తుప్పు పట్టని నాణ్యమైన పరికరాలను మాత్రమే వాడాలని, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సంస్థ గుర్తు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పాడైపోయిన కత్తులను వాడటం వల్ల ఆహారం కలుషితమై ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆహార వ్యాపారులు అందరూ తప్పనిసరిగా కఠినమైన నిబంధనలను పాటించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. అలాగే శానిటైజేషన్, స్టెరిలైజేషన్ తప్పనిసరి అని పేర్కొంది.

