కలం, ఖమ్మం బ్యూరో : సినీ నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) బర్త్ డే సందర్భంగా డయాబెటిక్ ఫూట్ పేషెంట్లకు శుభవార్త. తీవ్రమైన మధుమేహం వల్ల ఏర్పడే గ్యాంగ్రీన్ (Gangrene) సమస్యతో బాధపడుతున్న రోగులకు యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ (UK India Diabetic Foot Foundation) వారు ఉచిత వైద్యం అందిస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు స్వర్గీయ కృష్ణంరాజు కుటుంబం, లండన్ డాక్టర్ వేణు కలిసి స్థాపించిన ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి 20న ఈ ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. గ్యాంగ్రీన్ సమస్య వల్ల కాళ్ళ మీద కాలి వేళ్ళ మీద కురుపులు వచ్చి విపరీతమైన నొప్పితో బాధపడేవారికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఇక్కడ పేషెంట్ కు కావలసిన మందులు అన్నీ ఉచితంగా అందించనున్నారు.
ఈరోజు ఖమ్మం జిల్లా మధిర (Madhira) లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి (Shyamala Devi) తెలిపారు. కాబట్టి మధిర చుట్టు పక్కల ప్రజలు పూర్తి ఉచితంగా అప్పటికప్పుడు ఉపశమనం పొందవచ్చని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కాగా ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటులో మధిర శాసన సభ్యులు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) కుటుంబం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.


