కలం, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియలో సోన్ మండలం (Soan Mandal) 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచిందని తహసీల్దార్ సంతోష్ కుమార్ మంగళవారం తెలిపారు. ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను సోన్ మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు, బీఎల్వోలు సమన్వయంతో వేగంగా పూర్తి చేశారు.
ప్రతి ఇంటిని సందర్శిస్తూ అవసరమైన వివరాలను సేకరించి, డిజిటల్ విధానంలో నమోదు చేయడంతో వంద శాతం పురోగతి సాధించడం విశేషమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులను తహసీల్దార్ అభినందించారు. ప్రజలు కూడా పూర్తి సహకారం అందించడం వల్లే నిర్ణీత గడువులో లక్ష్యాన్ని చేరుకోగలిగామని చెప్పారు.

