కలం, నిజామాబాద్ బ్యూరో: చిరుత పులి జాడ కోసం నిజామాబాద్ డివిజన్ అటవీ శాఖ ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నిజామాబాద్ జగిత్యాల జిల్లాల సరిహద్దు కమ్మర్ పల్లి రేంజ్ పరిధిలో ఆపరేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అటవీశాఖతో పాటు సివిల్ పోలీసులు సైతం ఇందులో పాల్గొన్నారు. కోనా పూర్ సెక్షన్ లోకి వచ్చే కేసి తండా, వాసన్ గుట్ట తందాతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామస్తులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
దొరకని చిరుత జాడ
చిరుత పులి సంచారానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కానీ ఆధారాలు కానీ లభించలేదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశాలతో అక్కడ జనాలకు అటవీ జంతువులపై అవగాహన కల్పించారు. చిరుత లాంటి అటవీ జంతువుల ఆనవాళ్లు కనిపించినా సంచారం చూసినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చట్టాలు ఎలా ఉంటాయి? పులులు జనాల సంరక్షణ కోసం తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. చిరుతతో పాటు అటవీ జంతువుల సంచారంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని నిజామాబాద్ డీఎఫ్వో తెలిపారు. చిరుత సంచరిస్తున్నట్టు తెలిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

