కలం, గద్వాల: శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కేటిదొడ్డి మండలం గంగన్పల్లి (Ganganpalli) గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణం పూర్తిగా నీటమునిగింది. మొత్తం స్కూల్ మైదానం ఒక చిన్నపాటి చెరువును తలపిస్తూ కనిపిస్తోంది. స్కూల్ ముందు భాగంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డును ఎత్తుగా వేయడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. దాంతో నీరు మొత్తం పాఠశాల ప్రాంగణంలోనే నిలిచిపోయింది. ఈ పరిస్థితి అధికారుల నిర్లక్ష్యమా, లేక కాంట్రాక్టర్ అవగాహన లోపమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రాంగణం అంతా నీటితో నిండిపోవడంతో సోమవారం స్కూల్కు వచ్చే చిన్నారి విద్యార్థులు, ఉపాధ్యాయులు లోపలికి వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు, మండల అధికారులు వెంటనే స్పందించి స్కూల్ ప్రాంగణంలో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని గంగన్పల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

