కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఫ్లడ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదల వల్ల ఏర్పడే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ప్రారంభించారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిటీ పిలుపు మేరకు జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సహకారంతో ఈ మాక్ డ్రిల్ జరిగింది. ఈ కార్యక్రమంలో SDRF, ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రిసిటీ శాఖ, NCC, ఆపద మిత్ర, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఆర్ అండ్ బీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ 108 అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఆసుపత్రిలో వరదల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, రోగుల సురక్షిత తరలింపు, అత్యవసర సేవల సమన్వయం, విభాగాల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్, విపత్తు నిర్వహణ విధానాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ పర్యవేక్షించారు. డా. రాజశేఖర్, డా. సరస్వతి, నర్సింగ్ సూపరింటెండెంట్ లలిత, ఆసుపత్రి సిబ్బంది 108 బృందం సమన్వయంతో నిర్వహించారు.

