కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. పాలనలో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ సమావేశాన్ని పూర్తిగా పేపర్లెస్ (Digital) విధానంలో నిర్వహించబోతున్నారు. ఇందుకోసం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) ప్రత్యేకంగా రూపొందించిన ఈ-కేబినెట్ సాఫ్ట్వేర్ సహాయంతో మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్లను అందజేశారు. కేబినెట్ ఎజెండాలు, ఫైళ్లు, నోట్స్ అన్నీ పూర్తిగా డిజిటల్ రూపంలోనే మంత్రులకు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ అరుదైన డిజిటల్ భేటీలో పలు కీలక ప్రాజెక్టులతో పాటు ప్రజా సంక్షేమ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు తదుపరి విస్తరణ కార్యాచరణ, కొత్త రూట్ల నిర్మాణాలపై ఈ సమావేశంలో ప్రాథమిక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో వీబీజీ రామ్ జీ విస్తృత అమలుపై కేబినెట్ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది.
మరోవైపు ప్రస్తుత వానాకాలం సాగు పరిస్థితులపై ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్షించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం, సాగు విస్తీర్ణంపై చర్చించడంతో పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన విత్తనాలు, ఎరువుల పంపిణీ సజావుగా సాగేలా చూడటంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పాలనా పారదర్శకతను పెంచుతూ, పర్యావరణహితంగా సాగనున్న ఈ తొలి ఈ-కేబినెట్ సమావేశం (E-Cabinet Meeting) పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

