కలం, యాదాద్రి భువనగిరి: భార్యపై కోపంతో ఓ తండ్రి కన్నకూతురినే చంపేశాడు. ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలో నివాసం ఉంటున్న నాగరాణి శ్రీరాములు దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. భార్యాభర్తలిద్దరూ మూగవారు. అయితే కొన్ని రోజులుగా దంపతుల మధ్య వివాదాలు తలెత్తున్నాయి. బుధవారం మనవరాలిని తీసుకెళ్లడానికి తాత హన్మాపురం వెళ్లడంతో, ఆయన్నుంచి చిన్నారిని తండ్రి శ్రీరాములు లాక్కున్నాడు.
ఆ తర్వాత గ్రామ శివారులో తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఇంటికి వచ్చి పాప (Daughter) స్పృహ కోల్పోయిందని సైగలు చేశాడు. చెరువు సమీపంలో వెళ్లి చూడగా చిన్నారి స్పృహ తప్పిపోయి ఉండటంతో స్థానిక ఏరియా హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని బంధువులు తెలిపారు. అనంతరం చిన్నారిని చంపిన తండ్రి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా సమాచారం. అత్తింటివారి కారణంగానే తండ్రి పాపను హత్య చేశాడని, కఠినంగా శిక్షించాలని భార్య తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

