కలం, కరీంనగర్ : జగిత్యాల (Jagtial) రూరల్ మండలం మోరపెల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కనున్న బావిలోకి థార్ (Thar) వాహనం దూసుకెళ్లడంతో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో జగిత్యాలకు చెందిన నివేష్, అశ్విన్, అరుణ్ ప్రయాణిస్తున్నారు. భారీ శబ్దం విని స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్థులు నివేష్, అశ్విన్ను సురక్షితంగా బయటకు తీసారు. డ్రైవింగ్ చేస్తున్న అరుణ్ మాత్రం బావిలో గల్లంతయ్యాడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం అరుణ్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను ఫోన్లో చూస్తూ డ్రైవింగ్ చేసిన కారణంగా వాహనం అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కారుతో పాటు అరుణ్ కూడా నీటిలో మునిగిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రూరల్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం సుమారు రెండు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం కారులో చిక్కుకున్న అరుణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనతో జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

