కలం, సూర్యాపేట: పంటలపై రక్తం చల్లి పండించండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరసనగా సూర్యాపేట (Suryapet) జిల్లా చివ్వెంల మండలం సేవాలాల్ తండాలో పలువురు రైతులు తీవ్ర ఉద్వేగంతో తమ శరీరాల నుంచి రక్తాన్ని తీసి పంట పొలాలపై చల్లారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
రక్తం ఇచ్చాం.. ఇక నీళ్లు ఇవ్వు..
ఈ సందర్భంగా సేవాలాల్ తండా రైతులు మాట్లాడుతూ “మా రక్తం చల్లాం.. నీ కళ్లు చల్లబడ్డాయా రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా మా పంటలకు నీళ్లు ఇవ్వు!” అంటూ ఆగ్రహంతో నినదించారు. సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను చూసి కన్నీరు మున్నీరవుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం దారుణమని రైతులు మండిపడ్డారు. రేవంత్ వెంటనే రైతు లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్వీ ఆందోళనలు..
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తదాహానికి నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సోమవారం నుంచి ప్రత్యేక నిరసన కార్యక్రమాలను చేపట్టింది. రక్తదానం పేరుతో బీఆర్ఎస్వీ శ్రేణులు ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. అన్నదాతలను కించపరిచేలా మాట్లాడటం మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

