కలం మెదక్ బ్యూరో: తన భూమిని ఇతరులు కబ్జా చేశారంటూ, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు (Farmer) సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ (Medak) జిల్లాలో కలకలం రేపింది. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతుకు వ్యవసాయ భూమి ఉంది. కొంతకాలంగా తన భూమిని ఇతరులు అక్రమంగా కబ్జా చేసి, సాగు చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం సెల్ టవర్ పైకి ఎక్కి నిరసనకు దిగాడు. తక్షణమే న్యాయం చేయాలని, లేదంటే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. రైతు సెల్ టవర్ ఎక్కిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామాయంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతును టవర్పై దించేందుకు ప్రయత్నం చేశారు.

