కలం, వెబ్డెస్క్: వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ ఓ రైతు వడ్లను తగలబెట్టిన ఘటన జనగామ (Jangaon) జిల్లాలో చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ మండలం రంగరాయగూడెంలోని ఐకేపీ సెంటర్లో చెట్టిరెడ్డి నర్సింహారెడ్డి అనే రైతు వడ్లను తగలబెట్టాడు. ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనకపోవడంతో ఈ రకంగా నిరసన తెలిపాడు.
ఐకేపీ కేంద్ర నిర్వాహకులు లంచాలు ఇచ్చిన వారికే టోకెన్లు ఇస్తూ అవినీతికి పాల్పడుతుండటంతో, వారి చేతివాటంతో విసుగు చెందిన రైతు నర్సింహారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే వడ్లు కొనుగోలు చేయాలని రైతు డిమాండ్ చేశాడు.

