కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు జిల్లా వాసులను కలవర పెడుతున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వలన, కుటుంబాలు విచ్చిన్న మవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు నిరాశ్రయులు అవుతున్నారు, మరి కొన్ని సందర్భాల్లో అసువులు బాసుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలలో తల్లి తండ్రుల మానసిక స్థితి చూసిన వారు నిర్ఘాంత పోతున్నారు. ఎందుకంటే కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత మంది పేరెంట్స్ క్షణికావేశంలో తనువు చాలించడమే కాకుండా పిల్లలను కూడా చంపుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన నాగేశ్వరరావు, నందిని దంపతులకు ఇద్దరు పిల్లలు. బార్య కోరిక మేరకు అత్తగారి ఇంటికి సమీపంలో మణుగూరులో నివాసం ఉంటున్నారు. భార్య, భర్తల మధ్య తరచుగా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండేవి. అత్తగారింట్లో, బార్య అవమానకరంగా మాట్లాడిందనే కోపంతో, భర్త నాగేశ్వరరావు గడ్డి మందు తాగి, తన కొడుక్కి కూడా తాగించాడు. దీంతో తండ్రి, కొడుకులు ఇద్దరూ మరణించారు. భార్య, కూతురు నిరాశ్రేయులవడమే కాకుండా పచ్చని కుటుంబం విచ్చినమైంది.
ఏప్రిల్ 26 న ఖమ్మం (Khammam) నగరంలో జరిగిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాప పుట్టు వెంట్రుకలకు సంబంధించిన షాపింగ్ వివాదం మొత్తం కుటుంబాన్నే బలి తీసుకుంది. ఖమ్మం నగరం మామిళ్ళగూడెంలో రాము,రమ్య అనే బార్య భర్తలు, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. చిన్న పాప రితిక పుట్టు వెంట్రుకలకు సంబంధించిన షాపింగ్ విషయంలో గొడవపడి, క్షణికావేశంలో రాము పురుగుల మందు తాగి అత్మ హత్య చేసుకున్నాడు. ఈ విషయం బయటికి వస్తె, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో బార్య రమ్య, తన పెద్ద కూతురు దివ్యశ్రీని చంపి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. చివరగా చిన్న పాప రితిక కూడా నిన్న రాత్రి మరణించడం గమనార్హం. తల్లి తండ్రుల ఈగో కారణాల వలన, వారితో పాటు ఇద్దరు చిన్నారులు కూడా తనువు చాలించాడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు.
పై రెండు సందర్భాల్లో కూడా చిన్న చిన్న కారణాలతో భార్యలతో, భర్తలు గొడవ పెట్టుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనించవచ్చు. అలాగే తమతో పాటు పిల్లలను కూడా చంపుకోవాలనే ప్రయత్నాలు చేయడం ఈ మధ్య కాలంలో కనిపిస్తున్న ఒక వికృత పోకడ అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాలు ఏ విధంగా విచ్చిన్నమవుతున్నాయో, చూసి జిల్లా వాసులు నిర్ఘాంత పోతున్నారు.
జాడి చొక్కా రావు, న్యాయవాది
క్షణికావేశం అనేది ఒక చిన్న నిప్పుకణిక వంటిది. అది క్షణంలో ఆరిపోవచ్చు, లేదా జీవితకాలం నిర్మించుకున్న అందమైన సంసారాన్ని బూడిద చేయవచ్చు. నేటి సమాజంలో సహనం తగ్గిపోవడం, అహాలు పెరిగిపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న చిన్న కారణాలకే విచ్ఛిన్నమవుతున్నాయి. ఏళ్లుగా నిర్మించుకున్న కుటుంబ వ్యవస్థలను, చిన్నపాటి ఆవేశాలకు లోనై పోగొట్టుకోవద్దు. కోపం వస్తె ఆ క్షణం కళ్ళు మూసుకోండి, ఆవేశం తగ్గాక కళ్ళు తెరిస్తే మీ ముందు అందమైన కుటుంబం కనిపిస్తుంది.
Read Also: పిల్లలపై స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్.. లేటెస్ట్ రిపోర్ట్లో షాకింగ్ విషయాలు
Follow Us On: Instagram

