కలం, నిర్మల్: విద్యుత్ శాఖ (Electricity Department) అధికారుల నిర్లక్ష్యం మూగజీవాల పాలిట శాపంగా మారింది. తెగిపడిన విద్యుత్ తీగలకు తగిలి నాలుగు గొర్రెలు, రెండు మేకలు మృత్యువాత పడిన విషాద ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ (Kalwa) గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పశుపోషకుడు దేవన్న తన గొర్రెలు, మేకలను మేత కోసం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ విద్యుత్ తీగలు తెగిపడి నేలపై పడి ఉండటాన్ని గమనించకపోవడంతో మూగజీవాలు వాటిని తాకాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై నాలుగు గొర్రెలు, రెండు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల విలువైన మూగజీవాలను కోల్పోయినట్లు బాధితుడు దేవన్న ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ తీగలు తెగిపడి ప్రమాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించాడు. అదృష్టవశాత్తూ దేవన్నకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న గొర్రెలు, మేకలను కోల్పోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ప్రభుత్వం స్పందించి తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.

