కలం, వెబ్డెస్క్: జాతీయ పోటీ పరీక్షల సంస్థ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. నీట్, జేఈఈ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో (National Entrance Exams) ఫేస్ రికగ్నేషన్ ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తద్వారా అక్రమాలకు అడ్డుకట్టకు వేసే వీలవుతుందని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అత్యాధునిక ఫేస్ రికగ్నేషన్ను ప్రవేశ పెట్టాలని ప్రణాళికలు తయారుచేస్తోంది. ఈ పద్ధతి అమలుకు తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం చేస్తోంది. పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే అభ్యర్థుల ముఖాలను గుర్తించేలా లైవ్ ఫొటో క్యాప్చరింగ్ ఆప్షన్ తేవాలని భావిస్తోంది. వెబ్క్యామ్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఈ ఫొటోలు తీసి, వెంటనే అప్లోడ్ చేయడం వల్ల ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయకుండా అడ్డుకోవచ్చని ఎన్టీఏ అధికారులు భావిస్తున్నారు. కాగా పరీక్షలుకు ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ను గతేడాది ఢిల్లీలోని కొన్ని నీట్ పరీక్ష కేంద్రాల్లో పరిశీలించారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో వచ్చే ఏడాది నుంచి పేస్ రికగ్నేషన్ అన్ని పరీక్ష కేంద్రాల్లో అమలు చేయాలని అనుకుంటున్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై అడ్డుకోవడానికి కేంద్రం నియమించిన రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.


