కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దాగి ఉన్న పర్యాటక అందాలను ఫోటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి తెలంగాణ టూరిజం (Telangana Tourism) శాఖ భారీ నగదు బహుమతులు అందించనుంది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రకటన జారీ చేసింది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు వారాంతాల్లో వెళ్లేందుకు కొత్త ప్రదేశాలను అన్వేషిస్తుంటారని, ఈ నేపథ్యంలో 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలకు పెద్దగా తెలియని జలపాతాలు, పురాతన దేవాలయాలు, ట్రెక్కింగ్ పాయింట్లు వంటి 100 కొత్త ప్రదేశాలను గుర్తించి, వాటి వివరాలతో ఒక కాఫీ టేబుల్ బుక్ రూపొందించడమే ఈ కాంపిటేషన్ లక్ష్యమని తెలిపారు.
నేచర్, వైల్డ్ లైఫ్, ఆర్ట్ అండ్ కల్చర్, హెరిటేజ్, వాటర్ బాడీస్, వంటకాలు, ఫామ్ స్టేస్, రిసార్ట్స్, స్పిరిచువల్, అడ్వెంచర్ వంటి 10 విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఎంచుకున్న ప్రదేశానికి సంబంధించి 3 మంచి ఫోటోలు, 60 సెకన్ల వీడియో, ఆ ప్రదేశానికి రవాణా, బస, బడ్జెట్ వివరాలతో కూడిన వంద పదాల సమాచారాన్ని పోస్టర్లో పేర్కొన్న గూగుల్ ఫామ్ లేదా సోషల్ మీడియా అకౌంట్లలో ట్యాగ్ చేయొచ్చని తెలిపారు.
ఈ పోటీల్లో ఉత్తమ ఎంట్రీలకు మొదటి బహుమతిగా రూ.50 వేలు, సెకండ్ ప్రైజ్ రూ.30 వేలు, థర్డ్ ప్రైజ్ కింద రూ.20 అందించనున్నట్లు వివరించారు. అలాగే, కన్సోలేషన్ బహుమతులుగా హరిత హోటల్స్ లో ఉచిత బస కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు జనవరి 5వ తేదీలోపు ఎంట్రీలు పంపించాలని Telangana Tourism అధికారులు కోరారు.


