కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లా దేవరుప్పుల (Devaruppula) మండలం ధర్మపురం గ్రామంలో రైతుల సమస్యలు తీవ్రంగా మారాయి. వడ్లు కొనుగోలు ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేసిన రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) వాహనాన్ని ఆపి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే వడ్లు కొనుగోలు వేగవంతం చేయాలి” అని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదని అన్నారు.
రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. సకాలంలో రైతుబంధు ఇవ్వకపోవడం, విత్తనాలు–ఎరువుల సరఫరాలో లోపాలు ఉండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ‘ఎర్రటి ఎండలో రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం” అని విమర్శించారు. పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్లు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

