కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం(Khammam) రైల్వే స్టేషన్లో భారీగా అక్రమంగా రవాణా అవుతున్న ఎండు గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (Enforcement Officials) పట్టుకున్నారు. బుధవారం ప్లాట్ఫామ్ నెంబర్ 2 సమీపంలో నిర్వహించిన తనిఖీలలో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఒడిశాకు చెందిన సెబాస్టికా బీబర్ అనే వ్యక్తి వద్ద నుంచి సుమారు 22.450 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఖచ్చితమైన సమాచారంతో నిఘా పెట్టిన అధికారులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న ప్లాస్టిక్ సంచిలో ఈ గంజాయి లభ్యమైంది.
ఈ ఆపరేషన్ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి. జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్) జి. గణేష్, ఏఈఎస్ కే. తిరుపతి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సీఐ సిహెచ్. శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి నిర్వహించారు. నిందితుడిపై మత్తుపదార్థాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు ఒక సెల్ఫోన్ను ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. ఈ దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

