కలం, కరీంనగర్ బ్యూరో: గోదావరిఖని (Godavarikhani) అశోక్ నగర్ లో వృద్ధ దంపతులు వాటర్ ఎక్కిన సంఘటన మంగళవారం కలకలం రేపింది. 20 ఏళ్ల క్రితం నాటి ఇంటికి ఇప్పుడు అనుమతులు లేవంటూ రామగుండం నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులు అన్యాయంగా కూల్చివేశారని వారి ఆరోపించారు. సుమారు మూడున్నర గంటల పాటు ట్యాంక్ పైనే ఉన్న దంపతులు తమకు న్యాయం జరగని పక్షంలో దూకుతామంటూ హెచ్చరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇంట్లో లేని సమయం చూసి..
గోదావరిఖని (Godavarikhani) వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి మున్సిపల్ అధికారులను పిలిపించి హామీ ఇప్పించడంతో బాధితులు శాంతించి దిగడంతో సద్దుమణిగింది. కాగా, బాధితుల కథనం ప్రకారం.. రామగుండం నగర పాలక సంస్థ 22వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ ప్రాంతంకు చెందిన మీనుగు లక్ష్మీ, మొగిలి దంపతులు తమకు వారసత్వంగా వచ్చిన భూమిలో 20 యేళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని గత రెండు నెలల క్రితం తాము అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్ లో ఉండగా, ఇంట్లో లేని సమయం చూసి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తమ ఇంటిని కూల్చివేశారని వాపోయారు.
మున్సిపల్ ఆఫీసు వద్ద బైఠాయించినా..
ఆ సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు కూల్చివేసి ఉందని, హతాశయులమైన తాము వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే అనుమతి లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. 20 యేళ్ల నుంచి మున్సిపాలిటికి పన్నులు కడుతూనే ఉన్నామని, ఇప్పుడు అనుమతి లేదని కూల్చడం సరైంది కాదన్నారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలని గత వారం రోజులుగా మున్సిపల్ ఆఫీసు వద్ద బైఠాయించినా అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులతో వాగ్వాదం..
జరిగిన సంఘటనపై కోర్టును కూడా ఆశ్రయించినట్లు వారు తెలిపారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎన్ని మార్లు విన్నవించిన పట్టించుకోలేదని వాపోయారు. అధికారుల ఉదాసీనత వైఖరికి ఓపిక నశించి తమకు న్యాయం జరగదని నిర్ధారించుకొని వాటర్ ట్యాంకు ఎక్కినట్లు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని ఎలా కూల్చివేస్తారని బాధితురాలి కుమారుడు, కోడలు ట్యాంకు వద్ద అధికారులతో వాగ్వాదానికి దిగారు.
కాగా, గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మున్సిపల్ టీపీఎస్ నవీన్ ను పిలిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుమారుడు ట్యాంక్ పైకి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి కిందకు తీసుకువచ్చారు. ఆందోళన సద్దుమనగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : సీఎం రేవంత్ ఫారిన్ టూర్.. షెడ్యూల్ ఇదే!
Follow Us On: X(Twitter)

