కలం, వెబ్ డెస్క్: భారత్ దౌత్య పరంగా పెద్ద విజయం సాధించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, మోస్ట్ వాంటెడ్ డ్రగ్ సరఫరాదారు మహమ్మద్ సలీం డోలా (Mohammed Salim Dola)ను నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేసి దేశానికి తీసుకొచ్చారు. ఇటీవలే తుర్కియే దేశంలో ఆపరేషన్ గ్లోబల్ హంట్ ద్వారా.. సలీం ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఎట్టకేలకు అతడిని ప్రాణాలతో పట్టుకున్నారు. అనంతరం, అక్కడి నిబంధనలు పూర్తి చేసి.. ఈ రోజు ఉదయమే ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకొచ్చారు. సాయంత్రంలోగా అతడిని కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా ఇతడిపై కేసులు నమోదు..
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కీలక అనుచరుడిగా పనిచేసిన సలీం డోలాపై దేశ వ్యాప్తంగా ఇతడిపై ఇప్పటికే నార్కోటిక్ చట్టాల కింద పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. దేశంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తూ.. పోలీసులకు సవాళ్లు విసిరిన సలీం డోలా, భారత నార్కోటిక్ ఏజెన్సీలకు చిక్కకుండా విదేశాల్లో తిరుగుతున్నాడు. భారత్ వినతిపై 2024 మార్చిలోనే అతడిపై ఇప్పటికే ఇంటర్ పోల్ సైతం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి తాజాగా అరెస్ట్ చేసింది. ఇటీవల కాలంలో భారత్ విదేశాల్లో నుంచి తీసుకొచ్చిన నేరగాళ్లలో ఇతడు రెండో వాడు. ఇంతకుముందు, ముంబయి పేలుళ్ల ప్రధాన నిందితుడు తహవ్వూర్ రాణాను సైతం ఇలాగే అమెరికా నుంచి ఎన్ఐఏ అధికారులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

