కలం, వెబ్డెస్క్: న్యూజిలాండ్ (New Zealand) మాజీ ఆల్ రౌండర్ డగ్ బ్రేస్వెల్ (Doug Bracewell) కు భారీ షాక్ తగిలింది. అతడిపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడుతున్న సమయంలో బ్రేస్వెల్ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావడంతో క్రికెట్ నియంత్రణ సంస్థ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ 25న ఇంగ్లాండ్లో సోమర్సెట్, ఎసెక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో బ్రేస్వెల్కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో కోకైన్ వాడినట్లు తేలింది. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత, రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు తాను కోకైన్ తీసుకున్నట్లు బ్రేస్వెల్ స్వయంగా అంగీకరించాడు. బ్రేస్వెల్కు ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. 2024లో న్యూజిలాండ్ సూపర్ స్మాష్ టీ20 సమయంలోనూ కోకైన్ వాడి నెల రోజుల పాటు నిషేధానికి గురయ్యాడు. గతేడాది టెస్టు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, డిసెంబర్ 28న అతను క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ, నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) ఇప్పుడు అతనిపై కఠిన చర్యలు తీసుకుంది.
ఈ నిషేధం నవంబర్ 24, 2025 నుంచి నవంబర్ 23, 2027 వరకు అమలులో ఉంటుంది. ఈ సమయంలో అతను ఏ విధమైన క్రికెట్ కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదు. కోచింగ్ ఇవ్వడం, శిక్షణలో పాల్గొనడం నిషిద్ధం. ఏదైనా క్లబ్కు ప్రాతినిధ్యం కూడా వహించకూడదు. సెప్టెంబర్ నుండి నవంబర్ 2025 మధ్య కాలంలో అతను సాధించిన రికార్డులన్నీ రద్దు చేయబడతాయి. క్రీడా సంస్థల్లో ఎలాంటి పరిపాలనాపరమైన బాధ్యతలు చేపట్టకూడదు. బ్రేస్వెల్ ఆడిన ఎసెక్స్ క్లబ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రతి ఉద్యోగి ప్రొఫెషనల్ పద్ధతులను పాటించాలని, బోర్డు తీసుకున్న ఈ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. అతని ప్రవర్తనను సమర్థించకపోయినప్పటికీ, పునరావాస కేంద్రంలో చికిత్స పొందేందుకు తమ వంతు సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు. న్యూజిలాండ్ తరఫున 28 టెస్టులతో సహా మొత్తం 69 మ్యాచ్లు ఆడిన బ్రేస్వెల్, ఈ శిక్షను అంగీకరించాడు. ఈ వివాదంలో క్లబ్ పాత్ర లేకపోవడంతో ఎసెక్స్ జట్టుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతానికి ఈ నిషేధంతో బ్రేస్వెల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

