కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ తో యుద్ధంపై ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఒకసారి యుద్ధం ఆపేస్తామంటున్నారు. ఇంకోసారి ఇరాన్ ను సర్వనాశనం చేసేదాకా ఊరుకునేది లేదంటున్నారు. తాజాగా ప్రపంచ దేశాలు సతమతం అవుతున్న హర్మూజ్ జలసంధి మూసివేతపై సంచలన ప్రకటన చేశారు. ఏదో ఒక రకంగా హర్మూజ్ జలసంధికి స్వేచ్ఛ కలిపించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
ఈ జలసంధి మూసేయడం వల్ల ప్రభావితం అవుతున్న దేశాలు ఇప్పటికే అక్కడకు యుద్ధ నౌకలు పంపుతున్నాయని.. కాబట్టి మిగిలిన చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా, యూకేతో పాటు ఇతర దేశాలు కూడా నౌకలను అక్కడకు పంపాలని ట్రంప్ చెప్పారు. హర్మూజ్ తీర ప్రాంతాలపై దాడులు చేసి ఇరాన్ నౌకలను అమెరికా ముంచేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్ జలసంధికి త్వరలోనే స్వేచ్ఛ లభిస్తుందని ట్రంప్ ప్రకటించారు. దీంతో ట్రంప్ ప్రకటనపై ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాల్సిందే. అయితే హర్మూజ్ జలసంధి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు వాటి మిత్ర దేశాలకు మాత్రమే అనుమతి లేదని.. మిగతా దేశాల నౌకలు వెళ్లొచ్చని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది.

