కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో గత మూడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ అమెరికా (US), ఇరాన్ (Iran) దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి (Peace Deal) అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో వెల్లడించారు. లెబనాన్తో సహా అన్ని రకాల సైనిక చర్యలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించింది. వాషింగ్టన్, టెహ్రాన్లు సైతం ధృవీకరించాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం జూన్ 19న స్విట్జర్లాండ్లో జరగనుంది.
పశ్చిమాసియాలో శాంతి నెలకొనబోతుందనే ఈ కీలక ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం నాడే 4 శాతానికి పైగా భారీగా పడిపోయాయి.ఈ ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. అందరికీ అభినందనలు తెలిపారు. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి మార్గాన్ని ఎలాంటి రుసుము లేకుండా పూర్తిగా తెరిచేందుకు తాను అనుమతి ఇస్తున్నానని, అలాగే ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల నౌకలు తమ ఇంజన్లను స్టార్ట్ చేసుకోవాలని, చమురు ప్రవాహాన్ని సాగనివ్వాలని పిలుపునిచ్చారు.

