కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లావ్యాప్తంగా మొత్తం 36 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. గృహ అవసరాలకు వాడే డొమాస్టిక్ కనెక్షన్లు 5,86,870 కాగా, వ్యాపార అవసరాల కోసం వాడే కమర్షియల్ కనెక్షన్లు 2826 ఉన్నాయి. ప్రతిరోజు దాదాపుగా 8000 గ్యాస్ బుకింగ్స్ (Bookings) అవుతుండేవి. కానీ యుద్ధ ప్రభావం కారణంగా 25,000 వరకు బుకింగ్స్ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
గ్యాస్ కొరత వస్తుందనే అపోహలను నమ్మి చాలామంది అవసరానికి మించి పెద్దఎత్తున సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో గ్యాస్ కంపెనీల సర్వర్స్ పనిచేయడం లేదు. దీంతో బుకింగ్ కాకపోవడంతో కస్టమర్స్ గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూ కడుతున్నారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఆలస్యం కానుండటం, బుకింగ్ తర్వాత ఓటీపీ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గృహా అవసరాలకు సరిపడే స్టాక్ ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ సిలిండర్ల డెలివరీలో ఆలస్యం జరుగుతోందని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ సంక్షోభం కమర్షియల్ సిలిండర్లు వాడకంపై ప్రభావం చూపుతోంది. కమర్షియల్ సిలిండర్లు సరైన సమయంలో డెలివరీ కాకపోవడంతో హోటల్స్, రెస్టారెంట్లు, టీ స్టాల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, బ్లాక్ మార్కెటింగ్కు తరలించడం లాంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు సైతం నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని సూచించారు. జిల్లా ప్రజలకు అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్ల స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.

