కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu)లో టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ (Assembly) సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తన ప్రసంగం అందించి సమావేశాలను ప్రారంభించారు. కొత్త ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన వంటి ప్రాధాన్యతలను వివరిస్తూ గవర్నర్ ఇంగ్లీష్లో ప్రసంగించగా, స్పీకర్ జేసీడీ ప్రభాకర్ దానిని తమిళంలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా గవర్నర్ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో వందేమాతర గీతాన్ని ఆలపించేవారు. టీవీకే ప్రభుత్వం ఆ సాంప్రదాయానికి ముగింపు పలికింది. తమిళనాడు రాష్ట్ర గీతం తమిళ్ తాయి వళ్తు, జాతీయ గీతం జనగణమన ఆలాపనతో సమావేశాలను ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి మరియా విల్సన్ రూపొందించిన శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే సీఎం విజయ్ (CM Vijay) చేసే కీలక ప్రకటనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు, కొత్త ప్రభుత్వానికి ఈ తొలి సెషన్ ఒక పెద్ద రాజకీయ పరీక్షగా మారనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, విద్యుత్ కోతలు, పంట రుణాల మాఫీ, అత్యాచార సంఘటనలు, ఎమ్మెల్యేల రాజీనామాల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే సభ ప్రారంభానికి ముందే డీఎంకే నేతలు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ ఎదుట నిరసనలు తెలిపారు. తమిళనాడులో బాలికపై దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం నోరు విప్పాలని నినదిస్తూ ఆందోళన చేపట్టారు.

