కలం, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అన్నపురెడ్డిపల్లిలో దారుణ ఘటన జరిగింది. ఓ బాలికతో పలువురు అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలిక తల్లి ఫిర్యాదుతో ఏకంగా పది మందిపై పోలీసులు పోక్సో కేసు (POCSO Case) నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇటీవల స్థానిక బాలుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఇది గమనించిన స్థానికులు ఇంట్లోకి చొరబడి బాలుడిపై దాడి చేశారు. అతడిని బయటకు తీసుకొచ్చి స్తంభానికి కట్టేసి కొట్టారు.
అనంతరం విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. బాలిక కన్నీళ్లు పెట్టుకుంటూ తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. తదనంతరం బాలికను 10 మంది వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలికపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 10 మంది నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

