కలం, వరంగల్ బ్యూరో: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో మే 21 నుండి జూన్ 1 వరకు నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాల (Saraswati Antya Pushkaralu) నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాలపై జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ నోడల్ అధికారితో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పుష్కరాల నిర్వహణ కోసం సుమారు 2500 మంది పోలీసు సిబ్బందిని వినియోగించనున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం సుమారు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో పార్కింగ్ స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వన్వే ట్రాఫిక్ సిస్టమ్ అమలు చేయడం ద్వారా రద్దీని తగ్గించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు సులభంగా రాకపోకలు జరిగేలా రహదారుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన చేపడుతున్నామని, వారి భద్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యవసర సేవలు, వైద్య సదుపాయాలు, లైటింగ్, శానిటేషన్ వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

