కలం, వెబ్ డెస్క్: దేశంలో డీజిల్ ధరల పెరుగుదలతో ట్రక్కుల రంగానికి (Trucking Industry) భారీ షాక్ తగలనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగినా ట్రక్కు ఛార్జీలు అక్కడే ఉండటంతో ట్రక్ నిర్వాహకులు, చిన్న ట్రక్ యజమానులు, డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల ట్రక్కుల ఆపరేషన్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని రవాణా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరగడంతో కూరగాయలు, ధాన్యాలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ అంచనాలతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం మరింత భారంగా మారే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు తెలుపుతున్నాయి. చిన్న ట్రక్ యజమానులు, డ్రైవర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని రవాణా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
చమురుధరల పెంపును గమనిస్తే.. మే 15 నుండి మే 25 మధ్య డీజిల్ ధరలు లీటరుకు రూ. 7.50 పెరిగాయి. ఇందులో సోమవారం ( 2026 మే 25) ఒక్కరోజే లీటరుకు రూ. 2.71 పెరుగుదల నమోదవడం దేశ ప్రజల్నిషాక్ కు గురిచేసింది. డీజిల్ ధరలు పెరుగుతున్నా ట్రక్కు రవాణా చార్జీలు పెరగటం లేదు. ట్రక్కింగ్ ప్రధాన మార్గాల్లో రవాణా ఛార్జీలలో మాత్రమే స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా నౌకా రవాణా పెరిగినప్పటికీ సరుకు రవాణా బలహీనంగా ఉండటంతో పెరుగుతున్న డిమాండ్-సరఫరా మధ్య సమతుల్యత లోపిస్తోందని.. అందుకే ట్రక్కు చార్జీలు పెంపు సాధ్యమవడం లేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

