కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Liquor Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ, ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఆర్డర్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో సీబీఐ దర్యాప్తు తీరుపై ట్రయల్ కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు తీర్పుతో ఊరట లభించిందని భావించిన నేతలకు, హైకోర్టు నోటీసులతో ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాలతో మద్యం పాలసీ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

