Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీ క్రికెటర్‌కు ఆస్ట్రేలియా జట్టులో చోటు!

క‌లం, వెబ్ డెస్క్: ఢిల్లీలో జన్మించిన క్రికెటర్ నిఖిల్ చౌదరి (Nikhil Chaudhary) ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించే అవకాశానికి చేరువయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో 30 ఏళ్ల నిఖిల్‌కు అవకాశం లభించింది. వ్యక్తిగత కారణాలతో ట్రావిస్ హెడ్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో ఆయన స్థానంలో నిఖిల్‌ను ఎంపిక చేశారు. నిఖిల్ ప్రస్తుతం బెల్జియంలో జరుగుతున్న ఈయూటీ20 టోర్నీలో జేబీ బ్రూజెస్ తరఫున ఆడుతున్నాడు. అంతకుముందు ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కూడా అనుబంధంగా ఉన్నాడు. శుక్రవారం ధాకాలో ఆస్ట్రేలియా జట్టుతో చేరనున్నాడు.

ఢిల్లీలో జన్మించిన నిఖిల్, ఈ దశాబ్దం ప్రారంభంలో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. లెగ్ స్పిన్ బౌలింగ్‌తో పాటు మధ్యవరుసలో బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. తుది జట్టులో అవకాశం దక్కితే 1964లో రెక్స్ సెల్లర్స్ తర్వాత ఆస్ట్రేలియా తరఫున ఆడిన తొలి భారత సంతతి క్రికెటర్‌గా నిలుస్తాడు. ఆస్ట్రేలియా సెలెక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ, నిఖిల్ కొంతకాలంగా జాతీయ జట్టు పరిశీలనలో ఉన్నాడని తెలిపారు. గత సీజన్ బిగ్ బాష్ లీగ్‌లో అతని ప్రదర్శన సెలెక్టర్లను ఆకట్టుకుందని చెప్పారు. బంగ్లాదేశ్ పర్యటన అతనికి విలువైన అనుభవాన్ని అందిస్తుందని, తొలి టీ20 మ్యాచ్‌కే ఎంపికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించారు.

భారత్‌లో ఉన్న సమయంలో నిఖిల్ పంజాబ్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. హర్భజన్ సింగ్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలతో కలిసి జట్టులో ఉన్నాడు. అలాగే ముంబై ఇండియన్స్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. అనంతరం క్వీన్స్‌లాండ్‌లో ఉన్న తన బంధువులను సందర్శిస్తున్న సమయంలో కరోనా కారణంగా అంతర్జాతీయ సరిహద్దులు మూతపడటంతో ఆస్ట్రేలియాలోనే తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొత్తం చట్టోగ్రామ్‌లో జరగనుంది. తొలి మ్యాచ్ జూన్ 17న, రెండో మ్యాచ్ జూన్ 19న, చివరి మ్యాచ్ జూన్ 21న నిర్వహించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>