కలం, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ధార్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 35 మందితో వెళ్తున్న ఒక పికప్ వ్యాన్, తిర్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని చికాలియా క్రాసింగ్ దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో వాహనం వీరిని ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఇండోర్కు తరలించారు.
ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

