కలం, హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. 1000 రోజులు గడిచినా ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) విమర్శించారు. మంగళవారం హనుమకొండ (Hanumakonda) లోని బాలసముద్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు హామీల అమలుపై నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న హరీశ్రావును అరెస్టు చేయించారని ఆరోపించారు. జీవో 97ను రద్దు చేయించాలని స్థానిక ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. నియోజకవర్గంలో భూ కబ్జాలు జరుగుతున్నాయని, కాజీపేటలో గుడిసెల తొలగింపు అభివృద్ధి కాదని విమర్శించారు.
చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిరసనలు చేపడతామని అన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమ వసూళ్ల ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని నిలిపివేయాలని చూస్తే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదన్నారు.
నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ను రాజీనామా చేయాలని అడిగే ముందు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని రేవంత్రెడ్డికి సవాల్ చేశారు. ఢిల్లీకి పలుమార్లు వెళ్లిన ముఖ్యమంత్రి తెలంగాణకు ఏం తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.

