కలం, హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల వైఫల్యాలపై ప్రజల్లో సమరభేరి మోగిద్దామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ రెండో తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
హామీల అమలులో విఫలం..
6 గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అమలు చేయడంలో విఫలమైందని దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల సమస్యలను ప్రతి వర్గానికి వివరించాలని సూచించారు. హామీలను ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు, హామీల అమలు వైఫల్యాలు, అవినీతిని ప్రజలకు వివరించి చైతన్యపరచాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులు, లీగల్ సెల్ బాధ్యులు, మహిళా విభాగం, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.

