కలం, కాల్వ శ్రీరాంపూర్: బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్కు బయలుదేరిన ఆయనను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని కాంగ్రెస్ నాయకులు నిన్న రాత్రి ధ్వంసం చేసి, అదే పాత బ్రిడ్జికి కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకుడితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని పరిశీలించేందుకు అక్కడికి వెళ్లిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదని పేర్కొన్నారు. “బాధ్యత గల పోలీసులు వాస్తవం ఏంటో పూర్తిగా పరిశీలించి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోలీసుల అత్యుత్సాహం పనికిరాదు. బిఆర్ఎస్ కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం జరిగినా పార్టీ అండగా ఉంటుంది. ప్రతి కార్యకర్తకు నేను అండగా నిలుస్తాను” అని దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. వారి వెంట మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్, గర్రెపల్లి మాజీ సింగిల్ విండో చైర్మన జూపల్లి సందీప్ రావు, నాయకులు బోయిని రాజమల్లు, దొమ్మడి శ్రీనివాస్, జూకంటి అనిల్, సలేంద్ర రాములు, చంద్ర మొగిలి, రాజమల్లు, ఓదెల మండలం యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్,నవీన్ యాదవ్, కుంభం రాజు, రఫీక్, పాల అంజన్న,అజయ్, రాజు, కార్యకర్తలు ఉన్నారు.

