కలం, ఖమ్మం బ్యూరో : సీనియర్ రిపోర్టర్ చంద్రగిరి అపర్ణ మృతిపై సమగ్ర విచారణ జరిపి, ఆమె మరణం వెనుక ఉన్న అనుమానాలను తక్షణమే నివృత్తి చేయాలని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలోని ఐలయ్య కాలనీ నివాసి అయిన అపర్ణ (32) బుధవారం తన నివాసంలో ఉరివేసుకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సాబీర్ పాషా.. అపర్ణ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న జర్నలిస్ట్ అపర్ణ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అత్యంత బాధాకరమన్నారు. ఆమె మరణంతో వృద్ధురాలైన తల్లితో పాటు ఇద్దరు చిన్న కుమారులు పూర్తిగా అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతంతమాత్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలని కోరారు. ముఖ్యంగా చిన్నవారైన ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాధికారులు స్పందించి, వారికి తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అపర్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో సీపీఐ నాయకులు కొమారి హన్మంతరావు, మాచర్ల శ్రీనివాస్, సపావట్ రవి, ఉపేందర్, నాగమణి తదితరులు ఉన్నారు.

