కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రద్దీ రహదారిపై బైక్ నడుపుతూనే ల్యాప్టాప్లో పని చేస్తున్న ఓ యువకుడి చర్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) తీవ్రంగా స్పందించారు. వీడియోలో యువకుడు బైక్ ముందు భాగంలో ల్యాప్టాప్ను ఉంచుకుని ప్రయాణం చేస్తూనే పని చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విధమైన నిర్లక్ష్య వైఖరి అత్యంత ప్రమాదకరమని సజ్జనార్ హెచ్చరించారు.
“ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ‘వర్క్ ఫ్రమ్ బైక్’ (Work From Bike) చేయడం చాలా ప్రమాదకరం” అని ఆయన హెచ్చరించారు. “ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజం. రోడ్డు మీద ఒక క్షణం ఏకాగ్రత తప్పినా, అది మీ ప్రాణానికే కాదు.. పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదం” అని సజ్జనార్ స్పష్టం చేశారు.
కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. బాధ్యతారాహిత్యంగా బైక్ నడుపుతూ ఫోన్ వాడటం, ఇతర పనులు చేయడం మానేయాలి అని సూచించారు. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, పూర్తి దృష్టిని రోడ్డు మీదే ఉంచడం అత్యవసరమని తెలిపారు. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

