కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోధన్ మండలంలోని ఊట్పల్లిలో (Ootpally) నివసిస్తున్న సంజీవ్, జ్యోతి దంపతులు దురదృష్టవశాత్తు కరెంట్ షాక్కు గురై మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే… జ్యోతి ఇంటి వద్ద పిండిన బట్టలు ఆరేసే క్రమంలో దండెంపై వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. ఆమె గట్టిగా అరవడంతో భర్త సంజీవ్ వెంటనే పరుగున వచ్చి భార్యను కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి కూడా కరెంట్ పాస్ కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దండానికి విద్యుత్ సరఫరా కావడం వల్ల ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. దంపతుల మృతితో ముగ్గురు కూతుళ్లు అనాథలుగా మారారు. ఊట్పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

