కలం, ఖమ్మం బ్యూరో: ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ జావేద్ సంస్మరణ సభ (Javed Memorial Meeting) ఆదివారం నగరంలోని వైస్సార్ కాలనీ, రెడ్ హిల్స్ నందు అత్యంత భావోద్వేగభరిత వాతావరణంలో జరిగింది. ఈ సభకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జావేద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి, తుమ్మల మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జావేద్ చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన జావేద్కు భవిష్యత్తులో కార్పొరేషన్ పదవి ఇచ్చి గౌరవించుకోవాలని పార్టీ భావించిందని, కానీ అంతలోనే ఆయన ఇలా రోడ్డు ప్రమాదంలో అనంత లోకాలకు వెళ్లడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం జిల్లా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
మహమ్మద్ జావేద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని అధిష్ఠానంతో పాటు రాష్ట్ర మంత్రులు హామీ ఇచ్చారు. జావేద్ కుమార్తెలకు రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి సేవ చేసే ఆలోచన ఉంటే, కాంగ్రెస్ పార్టీ వారిని సాదరంగా ఆహ్వానిస్తుందని, వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ సంస్మరణ సభలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్ మువ్వా విజయబాబు, స్థానిక ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు, నగర కార్పొరేటర్లు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని జావేద్తో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. జావేద్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.
జావేద్ సభకు సంస్మరణ తరలివచ్చిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం

