కలం, నిర్మల్: నిర్మల్ ( Nirmal ) జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అందించిన సేవలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. వైఎస్సార్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

